న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ అంచనాలకు మించి రికార్డు లాభాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 24.1 శాతం వృద్ధితో రూ.8,105 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2017-18 ఇదే క్యూ3లో రూ.6,531 కోట్ల లాభాలు ఆర్జించింది. టాటా గ్రూపునకు సింహభాగం రెవెన్యూను అందిస్తుంది. క్రితం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో తమ రెవెన్యూలో 21 శాతం వృద్ధి చోటు చేసుకుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండి రాజేష్ గోపినాథ్ పేర్కొన్నారు. గత 14 త్రైమాసికాల్లో ఇదే రికార్డు రెవెన్యూ అని పేర్కొన్నారు. భౌగోళికంగానూ, అన్ని కేటగిరీల్లోనూ మెరుగైన వృద్ధిని నమోదు చేశామన్నారు.